చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

  • హైదరాబాదులో దాక్కున్నారని వ్యాఖ్యలు
  • చంద్రబాబును ప్రవాసనేతగా అభివర్ణించిన కృష్ణప్రసాద్
  • బాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడలేదని వెల్లడి
విపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. తనతో కలిసి అవినీతి, అక్రమాల్లో పాలుపంచుకున్న అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పలకరించడానికి ఏపీకి వచ్చారే తప్ప, ప్రజలు కరోనా సమస్యల్లో ఉంటే మాత్రం హైదరాబాదులో దాక్కున్నారని విమర్శించారు. విశాఖ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు బాబుకు సమయం లేదా? అని ప్రశ్నించారు. రమేశ్ ఆసుపత్రిలో ప్రమాదం జరిగి 10 మంది చనిపోతే బాబు ఎందుకు రాలేదని నిలదీశారు. ఏపీకి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇప్పుడో ప్రవాస నేతగా మారిపోయారని విమర్శించారు.

చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆ అనుభవంతో చంద్రబాబు ఏం సాధించగలిగారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులకు, లోకేశ్ ను ఎమ్మెల్సీగా, మంత్రిగా చేసేందుకు మాత్రం ఆయన అనుభవం పనిచేసిందని ఎద్దేవా చేశారు. చూస్తుంటే చంద్రబాబు హైదరాబాదులో కూర్చుని విలీనం కోసం ఆలోచిస్తున్నట్టుగా ఉందని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Vasantha Krishna Prasad
Chandrababu
Atchannaidu
Kollu Ravindra
Hyderabad

More Telugu News